సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురై, అగ్నిప్రమాదంలో 42 మంది సజీవదహనం అయిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్ర ముగించుకుని మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సు బదర్-మదీనా మార్గమధ్యంలో ఓ డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తెల్లవారుజామున 1:30 గంటలకు జరిగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది, వీరిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో హైదరాబాద్లోని మల్లేపల్లి బజార్ఘాట్కు చెందిన 16 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన కేసీఆర్, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ కోరారు. ఈ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి, బాధితుల వివరాల కోసం సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. బాధితుల వివరాల కోసం 79979 59754, 99129 19545 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.









