ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేయడమే కాదు.. మాటల వేడిని పెరిగింది. సోమవారం ఇరాన్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము త్వరలో ఉధృతం చేస్తామని ప్రకటించారు. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధం తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య మాటల వేడి
సోమవారం ఇరాన్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇక అమెరికాతో చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది. ట్రంప్ వ్యవహారశైలిని తూర్పారబట్టింది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో చెత్తను ఏరి వేస్తున్నామని, ఈ సమయంలో బయటికి రావొద్దని అమెరికా అక్కడి ప్రజలకు పిలుపు ఇచ్చారు.
ఇప్పటివరకు తాము యుద్ధం చేయలేదని, త్వరలో ఉధృతం చేస్తామని ప్రకటించారు. యుద్ధం మరో నాలుగైదు వారాలు కొనసాగవచ్చని సూచనప్రాయంగా చెప్పారు. ఇరాన్ను మా బలగాలు తరిమికొట్టాయని, అరబ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామని ట్రంప్ ప్రకటన
ఇరాన్ ప్రభుత్వంలో చాలామంది సభ్యులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కొత్త బాంబు పేల్చారు. వేలాది మంది తమకు ఫోన్ కాల్స్ చేసి వేడుకుంటున్నారని, ఖమేనీ చనిపోయినప్పుడు చాలామంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు.
ఇరాన్తో యుద్ధం మాకు బోర్ కొట్టదని, మా జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైనదని, ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని ధ్వంసం చేయడం మాలక్ష్యమన్నారు. నౌకాదళాన్ని నాశనం చేయడం, అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం తదుపరి లక్ష్యమని చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకు కంబాట్ దాడులు మాత్రమే చేశామని, అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాన్కు పంపిస్తామని చెప్పకనే చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రత్యక్ష యుద్ధానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ ప్రతిసారి అబద్ధం చెబుతోందని, ఆ దేశం వద్ద అమెరికాను నాశనం చేసే మిసైల్ వ్యవస్థ ఉందన్నారు. ఇరాన్కు చెందిన యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశామని, మరిన్ని దాడులు జరుపుతామని తేల్చిచెప్పారు.








