మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చేందుకు బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన హోంగార్డు నాగేష్, గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా అందాల్సిన నివేదిక కోసం ఏకంగా రూ. 2 లక్షలు డిమాండ్ చేసి, చివరకు లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోవడం ఈ కేసులో ప్రధానాంశం.
ఈ దారుణానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. బాధితుడి నుంచి మొదటి విడతగా రూ. 40 వేలు నగదు తీసుకుంటుండగా కీసర ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వద్ద ఏసీబీ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఇంత భారీ మొత్తంలో డబ్బులు అడగడంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని నిందితులను పట్టుకున్నారు. విధుల్లో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన హోంగార్డు, ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ కలిసి ఇలాంటి అవినీతికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం ఏసీబీ అధికారులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా గతంలో కూడా ఇలాగే ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చేశారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అరెస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ ఉన్నతాధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గానీ, ఆసుపత్రుల్లో గానీ ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు సూచించారు.








