ఏపీలో ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం గాయాలు కావడం, ఆస్తుల విధ్వంసం చోటు చేసుకోవడంతో వీటిని అరికట్టడంలో సీఎస్, డీజీపీ వైఫల్యం చెందారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ కూడా ఇవాళ వీరిద్దరినీ ఢిల్లీ పిలిపించి వివరణ తీసుకుంది.
మరోవైపు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎన్నికల తదనంతర హింసపై వెంటనే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై వెంటనే స్పందించిన హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రంలో ఎన్నికల హింసను అరికట్టడంలో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే హింసను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను కూడా ఆదేశించింది.
దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లాకు చెందిన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేసిన పోలీసులు.. విపక్ష నేతలను కూడా అదుపులో తీసుకుంటున్నారు. తాడిపత్రిలో జేసీ కుటుంబాన్ని అయితే ఏకంగా హైదరాబాద్ కే తరలించేశారు. దీంతో ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి హింస చోటు చేసుకోలేదు. ఇప్పటికే ఈసీ కూడా ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న నేపథ్యంలో అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు.









