ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు భారీ ఓటింగ్ శాతంతో రాష్ట్రంలో ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుకుంటే ఎన్నికల హింసతో రాజకీయ నేతలు, దాన్ని అరికట్టడంలో విఫలమై అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ సీఎస్, డీజీపీలను స్వయంగా ఢిల్లీకి పిలిపించి వివరణ తీసుకున్న ఈసీ.. హింసకు బాధ్యుల్ని చేస్తూ ముగ్గురు ఎస్పీలు, ఓ కలెక్టర్ పైనా వేటు వేసింది.
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులోని మాచర్ల, గురజాల, నరసరావుపేట, రాయలసీమలోని తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో భారీగా హింస చెలరేగింది. దీన్ని అరికట్టడంలో అక్కడి అధికార యంత్రాంగం విఫలమైందని ఈసీ భావించింది. దీంతో ఇవాళ ఢిల్లీకి సీఎస్, డీజీపీలను పిలిపించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరికలు చేసింది. అన్ని జిల్లాల ఎస్పీలను ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని సూచించింది.
ఎన్నికల కోడ్ ముగిసేలోపే హింసకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని సీఎస్, డీజీపీలకు అక్కడే ఆదేశాలు ఇచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సిఫార్సుల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం, తిరుపతి జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ మూడు జిల్లాల్లో 12 మంది కింది స్దాయి పోలీసు అధికారులపైనా చర్యలకు ఆదేశించింది. వీరిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అలాగే హింసాత్మక ఘటనలపై దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు కూడా ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన 15 రోజుల వరకూ కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలన్న ప్రభుత్వం వినతిని కూడా ఈసీ ఆమోదించింది.









