తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలింగ్ రోజు సమీపిస్తున్న సమయంలో మంగళగిరిలో రూ 25 కోట్ల నగదు సీజ్ చెయ్యడం కలకలకం రేపింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన ఓ వ్యాపారవేత్త ఇంట్లో రూ 25 కోట్ల నగదు సీజ్ చెయ్యడంతో వైఎస్ ఆర్ సీపీ నాయకులు ఉలిక్కిపడ్డారని తెలిసింది.
పెద్దిరెడ్డి అడ్డాలో నందమూరి ఎంట్రీ, వైసీపీ లీడర్స్ జంప్ జిలాని, పోలింగ్ ముందు పగిలింది !
శుక్రవారం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఆదాయ పన్ను శాఖ అధికారులు పంజా విసిరారు. గుంటూరు జిల్లాలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చెయ్యడంతో వ్యాపారులు హడలిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
మంగళగిరికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఇంటిలో సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ అధికారులు రూ 25 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యాపారి ఇంటిలో నగదుతో పాటు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చాలా సన్నిహితంగా ఉన్న మంగళగిరి బట్టల వ్యాపారికి ఐటీ శాఖ అధికారులు చుక్కు చూపించారు.
వైకాపా నాయకులతో సన్నిహితంగా ఉంటున్న ఆ బట్టల వ్యాపారి ఇంటిలో ఇంత పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంటిలో ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు నగదు నిల్వ చేశారు, ఎన్నికల్లో ఓటర్లకు నగదుకు పంచిపెట్టడానికి ప్రయత్నించారా అని అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది. మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడానికి వైసీపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.