UPDATES  

NEWS

 ఏపీ నూతన డీజీపీ ఖరారు – ఈసీ నిర్ణయం..!?

ఏపీలో ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. వరుస ఫిర్యాదుల ఆధారంగా కీలక అధికారుల పై చర్యలు తీసుకుంటోంది. తాజాగా డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం పదకొండు గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ సూచించింది.

 

కొత్త డీజీపీ పై కసరత్తు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజేంద్రనాథ్‌ రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వు లు జారీ చేశారు. తన తర్వాతి ర్యాంక్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. ఆదేశాలు అందే సమయానికి కార్యాలయంలో లేని రాజేంద్రనాథ్‌ రెడ్డి.. తన బాధ్యతల్ని శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చి కి అప్పగిస్తూ సంతకం చేసిన ఫైలును ఇంటి నుంచి పంపినట్లు తెలిసింది. ఫిర్యాదులు రావటంతో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్‌ బాషాపైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. తక్షణం విధుల నుంచి వైదొలగాలని ఆదేశించింది. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపకు చెందిన, ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డి 2022 ఫిబ్రవరి 17 నుంచి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

ఈసీ వరుస చర్యలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూటమి నేతలు వరుస ఫిర్యాదులు చేయటంతో ఇప్పటికే పలువురు పోలీసు అధికారుల పైన ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఐదుగురు ఎస్పీలు, గుంటూరు రేంజ్‌ ఐజీ, విజయవాడ సీపీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, చివరికి డీజీపీపైనా వేటు వేసింది. కొద్ది రోజుల క్రితం గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజుతో పాటు పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు రావడంతో అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, చిత్తూరు ఎస్పీ జాషువాను ఈసీ బదిలీ చేసింది. సీఎం జగన్‌ బస్సు యాత్రలో భాగంగా విజయవాడకు వచ్చినప్పుడు తగిన బందోబస్తు జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలతో విజయవాడ సీపీ కాంతి రాణాను తప్పించిన ఈసీ.. పీహెచ్‌డీ రామక్రిష్ణను ఎంపిక చేసింది.

 

కొత్త డీజీపీ తిరుమలరావు..? కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావును ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా . రాష్ట్రంలోని ఐపీఎస్‌ అధికారుల్లో తిరుమలరావు అందరి కన్నా సీనియర్‌. 1989లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో సీబీఐలో పనిచేశా రు. రాయలసీమ, తెలంగాణలో డీఐజీగా, సైబరాబాద్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా, కోస్తాంద్ర ఐజీగా, సీఐడీ ఏడీజీగా పని చేశారు. ఎలాంటి వివాదాల్లేని తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపేందుకు ఎంపిక చేసిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పేర్లలో తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్‌ ఉన్నట్లు తెలిసింది. రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా పనిచేస్తున్న అంజనా సిన్హా రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగంలో పనిచేయలేదు. మాదిరెడ్డి ప్రతాప్‌ కూడా అంతే. దీంతో తిరుమలరావు పేరు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |