ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ కుటుంబంలో వార్ పరాకాష్టకు చేరుతోంది. వైఎస్ షర్మిల తమతో విభేదించడానికి ఆమె అడిగిన రూ.1000 కోట్ల పనులు చేయకపోవడమే కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆమె ఇవాళ కౌంటర్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానంటూ షర్మిల వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. దీంతో ఈ వెయ్యి కోట్ల పనుల వ్యవహారం ఎన్నికల వేళ చర్చనీయాంశమవుతోంది.
వైసీపీ నేతలు తాను వెయ్యి కోట్ల పనులు అడిగానని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు. జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వాళ్లంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడేందుకు మీకెంత అందుతున్నాయంటూ వారిని ప్రశ్నించారు. వెయ్యి ఏంటి 10 వేల కోట్ల పనులు అడిగాను అని కూడా చెప్తారన్నారు. తాను ఒక్క పైసా సాయం అడగలేదని, నిరూపిస్తే రాజకీయాలు వదిలి వెళ్లిపోతా అన్నారు. వీళ్లంతా ఊసరవెల్లులని, అవసరానికి వాడుకుంటారని, అది తీరాక పుట్టుకనే అనుమానిస్తారన్నారు.
గతంలో జగన్ తన తండ్రి మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని ఆరోపణలు చేశారని, ఆ సంస్థపై దాడులు చేయించారని,సిఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వాళ్లకు ఎంపీ పదవి ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు. అలాగే వివేకా హత్య తర్వాత సీబీఐ దర్యాప్తు అడిగారని, సీఎం అయ్యాక విచారణ వద్దన్నారన్నారు. వైఎస్సార్ పేరు సీబీఐ ఛార్జిషీట్ లో పెట్టించారని, అది పెట్టిన పొన్నవోలుకు అదనపు ఏజీ పదవి ఇచ్చారన్నారు.
సొంత తండ్రి పేరు సీబీఐ ఛార్జిషీట్ లో పెట్టించిన ఘనత జగన్ ది అని షర్మిల ఆరోపించారు. అవినాష్ రెడ్డి తన భర్త అనిల్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ల్యాండ్ క్రూజర్ లో వెళ్లి కలిశారని చెప్పడాన్ని ఆక్షేపించారు. అవినాష్ రెడ్డి లాగ మద్య రాత్రి గొడ్డలితో వెళ్ళడం తమకు చేతకాదన్నారు. అనిల్ కలవలేదు, మీరు రుజువు చేయలేదన్నారు. అనిల్ కి ఏ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు.









