ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై స్పందించారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కవితపై ఎలాంటి కేసూ లేదు.. అయినా.. కక్ష కట్టి అరెస్టు చేశారన్నారు కేసీఆర్.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూల్చేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నించాడని కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు పంపాం. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారు. అందుకే మనపై కక్ష పెంచుకున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అందుకే కవితను కుట్రపూరితంగా మనీలాండరింగ్ కేసులో ఇరికించారని కేసీఆర్ స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందిస్తూ.. ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య తలెత్తిందన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో మిల్లర్లు లేరని చెప్పారు. అన్నింటా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట అధికారులు వినడం లేదన్నారు. కాంగ్రెస్ ను నమ్మడం లేదని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనన్న కేసీఆర్.. రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా మనదే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ తెలిపారు. గట్టిగా పోరాడితే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని కేసీఆర్ తెలిపారు.
అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని ఓ నాయకుడు తనతో వాపోయాడు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని ఓ సీనియర్ కీలక నేత తనను సంప్రదించాడు. ఇప్పుడే వద్దని వారించానని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్లో టీమ్ వర్క్ లేదు.. స్థిరత్వం లేదు. ఇప్పటి వరకు 8 లోక్సభ సీట్లలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయి. మరో మూడు స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు.