టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొనేందుకు చుట్టుపక్కల జిల్లాలనుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. దీంతో రోడ్లన్నీ పసుపు మయంగా మారాయి.
దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. పేదలు, మంచివాళ్లు ఎక్కడ ఉంటే నేను అక్కడ నుంచే పోటీ చేస్తానని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చీకటి వ్యాపారాల పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని చంద్రబాబు విమర్శించారు.
“విశాఖను డ్రగ్స్, గంజాయి కేంద్రంగా మార్చేశారు. పేదలకు అన్నం పెట్టే అన్నాక్యాంటీన్లను రద్దు చేశారు. ఇకనుంచి పోలీసులు ఎన్నికల అధికారులు చెప్పినట్టే చేస్తారు. ఇక నుంచి మీ ఆటలు సాగవు.
అధికారం అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి.. ఎన్నికలను సజావుగా జరగనివ్వండి. నోరు విప్పితే అని అబద్దాలే.. అన్నీ ఫేక్ వార్తలే. నా జీవితంలో ఇలాంటి రాజకీయాన్ని ఏనాడు చూడలేదు. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీని లక్ష్యంగా పెట్టుకున్నాం. కుప్పం ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నా. 40 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ఐదేళ్లలో చేసి రుణం తీర్చుకుంటా.
జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ నష్టపోయారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మనం గెలవాల్సిన అవసరం ఉంది. వైసీపీ చేసిన తప్పుడు పనులకు ఫ్యాన్ కనబడకుండ పోవాలి. ఒంటిమిట్టలో చేనేత కార్మికుడు సుబ్బారావు భూమిని లాక్కున్నారు. వైసీపీ నాయుకుల భూదాహానికి ఓ కుటుంబం బలైంది. కొందరు కులాలు, మతాలు చూసి రాజకీయాల్లో పోటి చేస్తారు. పేదలు, మంచివాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ నేను పోటీ చేస్తా. పేదలే నా మతం, కులం.
ఎన్డీఏ లక్ష్యం 400 ఎంపీ సీట్లు గెలవడం. 160 అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ స్థానాలు గెలవడం మన లక్ష్యం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం చాలా అవసరం. మేం అధికారంలోకి వచ్చాక రూ.4,000 పింఛను ఇంటివద్దకే తెచ్చి ఇస్తాం. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీనే. ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మంది ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 అందిస్తాం. బెంగళూరు సిటీకి కుప్పాన్ని అనుసంధానం చేస్తాం. బెంగుళూరు నుంచి కుప్పం వచ్చి చదువుకునేలా చేస్తాం. యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రశాంతమైన కుప్పం నా లక్ష్యం. అభివృద్ధిని మనం చేస్తే.. ఐదేళ్లలో వైసీపీ నేతలు గాడిదల పళ్లు తోమారు” అని చంద్రబాబు అన్నారు.