ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టిడిపి అభ్యర్థిని మార్చిందా ? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఒంగోలు టిడిపి ఎంపీ అభ్యర్థిగా అధిష్ఠానం మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తొలుత మాగుంట తనయుడు రాఘవరెడ్డికి సీటివ్వాలని భావించింది టిడిపి. కానీ తాజాగా అక్కడ ఎవరి బలమెంతో తెలుసుకున్న అధిష్ఠానం.. వ్యూహం మార్చింది.
తనయుడి కంటే తండ్రికి సీటిస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో.. ఒంగోలు ఎంపీ టికెట్ ను మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఖరారు చేసినట్లు సమాచారం. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి తన తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని తనయుడు రాఘవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలుతో పాటు.. పెండింగ్ లో ఉన్న విజయనగరం, కడప, అనంతపురం సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మాగుంట.. 1998, 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో టిడిపిలో చేరి.. అక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల ముందు మార్చిలో.. టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.
ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట కు కేటాయించకపోవడంతో.. వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. తొలుత మాగుంట తనయుడికి టికెట్ ఇవ్వాలని భావించిన టిడిపి.. బలాబలాలను పరిశీలించిన తర్వాత మాగుంట శ్రీనివాసులనే ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.









