ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరులో ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో రూపొందించారు. సుమారు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్తో నిర్మించిన ఈ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ప్రశంసించారు. ఆయన త్యాగానికి నివాళిగా రాష్ట్రంలో జల్జీవన్ మిషన్ పనులకు ‘అమరజీవి జలధార’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి నడిబొడ్డున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆయన త్యాగం ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ.. యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీని కేవలం 194 రోజుల్లోనే నెరవేర్చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. శాఖమూరులో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతి వనంలో త్వరలోనే మ్యూజియం, ఫోటో గ్యాలరీ మరియు మినీ థియేటర్ పనులను కూడా పూర్తి చేస్తామని లోకేష్ వెల్లడించారు.








