సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నీరజ కోన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘తెలుసు కదా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వైఫల్యంపై హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తనకు ఒక అవగాహన వచ్చేసిందని, స్క్రిప్ట్ విషయంలో తనకు ఉన్న సందేహాలను ముందే వ్యక్తపరిచానని ఆమె బహిరంగంగా వెల్లడించారు.
ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ మరియు ఆపరేషన్ సీన్ విషయంలో తనకు అప్పట్లోనే అభ్యంతరాలు ఉన్నాయని రాశీ పేర్కొన్నారు. క్లైమాక్స్ ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలని, కానీ ఈ సీన్ ఏదో తేడా కొడుతోందని తనకు అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సీన్ చేయనని తాను చెప్పినప్పటికీ, దర్శకురాలి విజన్ మరియు ఆమెపై ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్లాల్సి వచ్చిందని, చివరకు తన సందేహాలే నిజమయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సాగుతున్న కొద్దీ స్క్రిప్ట్లో చాలా మార్పులు వచ్చాయని, ఆ సమయంలో తన చేతుల్లో ఏమీ లేకపోయిందని ఆమె వివరించారు.
ఈ సినిమా వైఫల్యం ద్వారా తాను ఒక గొప్ప గుణపాఠం నేర్చుకున్నానని రాశీ ఖన్నా తెలిపారు. స్క్రిప్ట్ విషయంలో తనకు నచ్చని అంశాలు ఉన్నప్పుడు తన అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాల్సి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా, సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో వన్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్ట్గా వచ్చిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.








