పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం విశాఖ స్టీల్ ప్లాంట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో ఏర్పడిన మార్పుల వల్ల ప్లాంట్కు అత్యంత కీలకమైన ఎల్పీజీ (LPG) కొరత ఏర్పడింది. ప్రస్తుతం ప్లాంట్లో ఉన్న నిల్వలు మరో పది రోజులకు మాత్రమే సరిపోతాయని, సరఫరా పునరుద్ధరించకపోతే ఉత్పత్తి మొత్తం నిలిచిపోయి ప్లాంట్ మూతపడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్టీల్ మెల్టింగ్ షాప్లో తయారైన స్టీల్ బ్లూమ్స్ను అవసరమైన పరిమాణంలో కట్ చేయడానికి ఎల్పీజీని ఇంధనంగా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ సుమారు 4,000 బ్లూమ్స్ను కట్ చేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియకు ఎల్పీజీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గ్యాస్ సరఫరా ఆగిపోతే ప్రతిరోజూ ప్లాంట్ ఉత్పత్తి చేసే 10,000 టన్నుల ఫినిష్డ్ స్టీల్ నిలిచిపోవడమే కాకుండా, సంస్థకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.
ఈ సంక్షోభంపై విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ స్పందిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. గ్యాస్ సరఫరా నిలిచిపోతే వేలాది మంది కార్మికులపై ప్రభావం పడుతుందని, కావున సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని ఆయన కోరారు. ఎంపీ విజ్ఞప్తికి కేంద్ర అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. గ్యాస్ నిల్వలను పెంచడం ద్వారా ఈ గండం నుంచి గట్టెక్కవచ్చని అధికారులు భావిస్తున్నారు.








