ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నివాసంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. లోకేశ్-బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ పంచెకట్టు (ధోతీ) వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఈ విశేష ఘట్టానికి సంబంధించిన ఫోటోలను లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తన కుమారుడు భారతీయ సంప్రదాయాలను స్వీకరించడం చూస్తుంటే గర్వంగా ఉందని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు.
ఈ సంప్రదాయ వేడుకలో దేవాన్ష్ పంచెకట్టులో ఎంతో హుందాగా కనిపించగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు హాజరై తమ మనవడిని దీవించారు. అలాగే నందమూరి బాలకృష్ణ, వసుంధర దంపతులు కూడా పాల్గొని మనవడి వేడుకను సంతోషంగా తిలకించారు. తెలుగు సంప్రదాయం ప్రకారం మేనమామ హోదాలో నందమూరి మోక్షజ్ఞ దేవాన్ష్కు నూతన వస్త్రాలను బహూకరించి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దేవాన్ష్కు జీవితాంతం సుఖసంతోషాలు, విజయాలు కలగాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ ఆకాంక్షించారు. నారా మరియు నందమూరి కుటుంబ అభిమానులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా దేవాన్ష్కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.








