పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అయితే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు దీటుగా ఉండే ప్రతినాయకుడి పాత్ర గురించి ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్ ఈ సినిమాలో విలన్గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. గతంలో అర్జున్, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి వంటి తమిళ స్టార్లు తెలుగులో విలన్లుగా మెప్పించిన తరహాలోనే, పార్తీబన్ కూడా తన విలక్షణ నటనతో ఇక్కడ ముద్ర వేయాలని చూస్తున్నారు. హరీశ్ శంకర్ ఈ విలన్ పాత్రను చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారని, సినిమా హైలైట్స్లో పార్తీబన్ నటన ఒకటిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తమిళంలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన పార్తీబన్, తెలుగు ప్రేక్షకులకు అనువాద చిత్రాల ద్వారానే సుపరిచితులు. నేరుగా ఆయన చేస్తున్న ఈ తొలి తెలుగు చిత్రంపై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. పవన్ కల్యాణ్కు, పార్తీబన్కు మధ్య వచ్చే ఘర్షణ సన్నివేశాలు వెండితెరపై ఒక రేంజ్లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.








