UPDATES  

NEWS

 ఏపీ లిక్కర్‌ స్కాం రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు..!

ఏపీ లిక్కర్‌ స్కాంలో 33వ నిందితుడు గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ని విజయవాడ జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో లిక్కర్‌ వ్యవహారంలో వేల కోట్ల ముడుపుల సొత్తును డొల్ల కంపెనీలకు మళ్లించి.. అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో గోవిందప్ప బాలాజీది కీలక పాత్రని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

 

నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో సిట్ బృందాలు గాలించాయి. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్‌ అటవీ ప్రాంతంలో గోవిందప్ప బాలాజీ ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేశాయి.మంగళవారం ఎరకనగడ్డె కాలనీలోని ఓ వెల్‌నెస్‌ సెంటర్‌ బయట గోవిందప్ప బాలాజీని అదుపులోకి తీసుకున్నారు.

 

ట్రాన్సిట్‌ వారంట్‌ నిమిత్తం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విజయవాడకు తీసుకొచ్చి నిన్న ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్ట్తో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.

 

మరోవైపు గోవిందప్ప బాలాజీ గురించి రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలను సిట్‌ ప్రస్తావించింది. మద్యం స్కాం సిండికేట్‌లో ఆయనది కీలక పాత్రని పేర్కొంది.గోవిందప్ప బాలాజీ…మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెలిపింది. జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూస్తుంటారంది.జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారని పేర్కొంది.కేసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడని తెలిపింది. ప్రధాన బ్రాండ్లు ఆపి అనుకూల బ్రాండ్ల విడుదల్లో కీలక పాత్ర పోషించారని వివరించింది. సొంత బ్రాండ్లు మార్కెట్లోకి తీసుకొచ్చి కోట్లు కొల్లగొట్టారని వెల్లడించింది.

 

సిండికేట్‌లో గోవిందప్పది కీలక పాత్ర అని ఏపీబీసీఎల్‌ అధికారులు సత్యప్రసాద్‌, వాసుదేవరెడ్డి చెప్పారని సిట్ వివరించింది. డిస్టిలరీలు, సప్లయర్ల కమీషన్లు గోవిందప్పకు చేరాయని పేర్కొంది. మద్యం ద్వారా వచ్చిన మొత్తాన్ని వివిధ రూపాల్లో మళ్లించారని అక్రమ సొమ్ముతో స్థిరాస్తులు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు వివరించింది. డబ్బు ఎలా మళ్లించాలో గోవిందప్పకు తెలుసని చెప్పింది.ఇలాంటి కేసుల్లో పదేళ్ల వరకు శిక్ష పడుతుందని రిమాండ్‌ రిపోర్టులో తెలిపింది.

 

మరోవైపు లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్రెడ్డిని మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ,రేపు, ఎల్లుండి ఆయణ్ని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించారు. మద్యం కుంభకోణంలో కీలకంగా పని‌చేసిన సజ్జల శ్రీధర్రెడ్టి ద్వారా మరింత సమాచారం రాబట్టాలని సిట్ భావిస్తోంది.

 

ఇదిలా ఉంటే.. ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈరోజు 10 గంటలకు సెట్ విచారణకు హాజరుకానున్నారు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. నిన్న దాదాపు 6 గంటల పాటు ఇద్దరని విచారించారు సిట్ అధికారులు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న ధనుంజయ రెడ్డి,కృష్ణమోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కీలకపాత్ర పోషించారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పటికే విచారణలో అనేక కీలక విషయాలు తెలుసుకున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి కంటే పై స్థాయిలో A31, A32, A33 కీలకపాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. తన వద్ద నుండి కిక్‌బ్యాగ్ రూపంలో నగదును బాలాజీ గోవిందప్ప తీసుకెళ్లారని విచారణలో కేసిరెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |