ఎన్నికల సంఘం రైతులకు రైతులకు షాకిచ్చింది. రైతు భరోసా నిధుల జమ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అధికారులు వెంటనే రైతు భరోసా నిధుల జమను ఆపారు. మే 13 పోలింగ్ ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. మే 9 లోగా రైతు భరోసా నిధుల జమ పూర్తి చేస్తామని ఎన్నికల ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
దీన్ని కోడ్ ఉల్లంఘన భావించిన ఈసీ రైతు భరోసా నిధుల జమను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే పంట నష్టపరిహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పంట నష్టపరిహార డబ్బులు జమ కానున్నాయి. తెలంగాణలో మార్చి 16 నుంచి 24 మధ్య పది జిల్లాల్లో వడగళ్లవానతో రైతులు పంట నష్టపోయారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేసింది.
15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఎకరాకు రూ.10 చొప్పున రూ.15.81 కోట్లు విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాలో 160.10 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 10,328.04 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 1,652.25 ఎకరాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,014.06 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 746.30 ఎకరాలు, మెదక్ జిల్లాలో 714.17 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 545.09 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 332.17 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 244.01 ఎకరాలు, సంగారెడ్డిలో 76.04 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల సంఘం అనుమతితో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. రేపటిలోగా రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం సొమ్ములు జమ అయ్యే అవకాశం ఉంది.