ప్రస్తుతం లిక్కర్ పాలసీ కేసులో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలతో కేజ్రీవాల్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా NIA విచారణకు ఆదేశించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఝలక్ ఇచ్చారు. కేజ్రీవాల్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఆయనపై NIA విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేంద్రానికి సిఫార్సు చేశారు.
నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా నిధులు అందాయని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. ఖలిస్థానీ గ్రూపుల నుంచి ఆప్ 16 USD మిలియన్ల నిధులు పొందినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోం కార్యదర్శికి లేఖ ద్వారా వెల్లడించారు. దీంతో పాటుగా పన్నూన్ ఇటీవలే ఆప్ కు భారీగా నిధులు అందించామనే వీడియో క్లిప్ ను కూడా ఆయన జత చేశారు.
కాగా, ఉగ్రవాది దేవేంద్ర పాల్ భుల్లర్ ను విడుదల చేయడానికి భారీగా ఆప్ కు నిధులు పంపినట్లు పన్నూ గతంలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు. దేశంలో ఖలిస్థానీ అనుకూల భావాలను ప్రోత్సహించడానికి వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూన్ స్థాపించిన నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉద్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్.