ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మకమైన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం లభించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించడం, పారిశ్రామిక సంస్కరణలు మరియు పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన చూపుతున్న చొరవకు గుర్తింపుగా ఎకనమిక్ టైమ్స్ (Economic Times) ఈ అవార్డును ప్రకటించింది. గతంలో కేంద్రమంత్రులు ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్ వంటి హేమాహేమీలు అందుకున్న ఈ అవార్డు ఇప్పుడు చంద్రబాబును వరించడం విశేషం.
ఈ అవార్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా తాను ఇలాంటి అవార్డులకు ప్రాధాన్యత ఇవ్వనని, గతంలో విదేశీ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని గుర్తుచేశారు. అయితే, ఈ ‘బిజినెస్ రిఫార్మర్’ అవార్డు దక్కడం వెనుక తన ఒక్కడి కృషి లేదని, దీని పూర్తి క్రెడిట్ తన సహచర మంత్రులు, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయడం వల్లే రాష్ట్రంలో సంస్కరణలు సాధ్యమవుతున్నాయని ప్రశంసించారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం వివరించారు. ఈ అవార్డు రావడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట పెరగడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులకు ఏపీపై మరింత నమ్మకం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ పరిణామం పట్ల కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.









