తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2026 మార్చి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రేపు, అంటే డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి విశిష్ట సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లను కేటాయిస్తారు. భక్తులు ఈ సేవల కోసం రేపటి నుంచి డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
ఆర్జిత సేవల షెడ్యూల్ ప్రకారం.. ఎలక్ట్రానిక్ డిప్లో టికెట్లు పొందిన వారు డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి బుకింగ్ ఖరారు చేసుకోవాలి. అదే రోజు (డిసెంబర్ 22) ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాను విడుదల చేస్తారు. అలాగే డిసెంబర్ 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లతో పాటు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక కోటా టోకెన్లు విడుదల కానున్నాయి.
భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను డిసెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలోని వసతి గదుల (Accommodation) కోటాను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. భక్తులు మోసపూరిత వెబ్సైట్లను నమ్మవద్దని, కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.









