UPDATES  

NEWS

 అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్: జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారుల పనితీరును స్వయంగా పర్యవేక్షించేందుకు వచ్చే జనవరి నుంచి జిల్లాల్లో తాను ఆకస్మిక తనిఖీలు చేపడతానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఏమాత్రం జాప్యం సహించేది లేదని, ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థిక, ఆర్థికేతర అంశాలుగా విభజించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రీవెన్సులు (ఫిర్యాదులు) తక్కువగా వస్తేనే పాలన బాగున్నట్లు లెక్క అని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే త్రైమాసికం నాటికి రాష్ట్రంలో ‘జీరో గ్రీవెన్సులు’ (ఫిర్యాదులే లేని స్థితి) ఉండాలన్నదే తమ లక్ష్యమని, ఆ దిశగా కలెక్టర్లు కఠినంగా పని చేయాలని నిర్దేశించారు.

మౌలిక సదుపాయాల విషయంలోనూ సీఎం గడువు విధించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మురుగు కాలువలను రాబోయే మూడు నెలల్లోగా పూర్తిగా శుభ్రం చేయాలని ఆదేశించారు. తాగునీటి భద్రత గురించి చర్చించుకుంటున్న ఈ సమయంలో ప్రజలకు నీటి కష్టాలు ఉండకూడదని, ఎక్కడ సమస్య తలెత్తినా జలవనరుల శాఖ తక్షణమే స్పందించాలని తేల్చిచెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |