తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఒక అత్యంత ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు గ్రామంలో ఏపీ రాజకీయ ఉద్దండుల పేర్లు కలిగిన ఇద్దరు వ్యక్తులు సర్పంచ్ పదవి కోసం తలపడ్డారు. ఈ ఎన్నికల్లో జగన్ అనే పేరు గల వ్యక్తిపై చంద్రబాబు అనే పేరు గల వ్యక్తి విజయం సాధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళ్తే.. గుండ్లరేవు గ్రామంలో సర్పంచ్ బరిలో భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం (జగన్) నిలిచారు. విశేషమేమిటంటే, వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలోని రెండు వేర్వేరు వర్గాల మద్దతుతోనే పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు పోలి ఉండటంతో, గ్రామస్తుల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఈ ఎన్నికల ప్రచారం భారీ స్థాయిలో ఆకర్షణగా నిలిచింది.
ఈరోజు వెలువడిన ఫలితాల్లో బానోత్ జగన్పై భూక్యా చంద్రబాబు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలను గుర్తు చేస్తూ.. “జగన్పై చంద్రబాబు విజయం” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు మరియు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. కేవలం పేర్ల పోలిక వల్ల ఈ చిన్న గ్రామం ఎన్నికల ఫలితం కాస్తా రాష్ట్రస్థాయిలో వైరల్ అయింది.









