ప్రముఖ నటుడు రామ్చరణ్ భార్య, అపోలో సీఎస్ఆర్ వైస్ ఛైర్మన్ కొణిదెల ఉపాసన, తాను పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన చర్చపై స్పందించారు. తన పోస్టుపై ఆరోగ్యకరమైన చర్చను లేవనెత్తినందుకు ఆనందిస్తున్నానని, స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఇంతకుముందు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, అమ్మాయిలు ముందుగా ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే వివాహం చేసుకోవాలని, తాను కూడా అదే చేశానని సూచించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీశాయి.
ఉపాసన సలహాపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా, జోహో సీఈవో శ్రీధర్ వెంబు కూడా ఉపాసన వీడియోపై స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలతో విభేదించారు. యువత త్వరగా వివాహం చేసుకుని 20 ఏళ్ల లోపు పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, తన పోస్టుపై ఇంతటి చర్చ జరగడం, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవడాన్ని ఉపాసన స్వాగతించారు.
ఈ చర్చపై స్పందిస్తూ, అందరూ మాట్లాడుతున్న ప్రత్యేక హక్కులపై (privilege) తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నానని ఉపాసన పేర్కొన్నారు. సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయి వేచి చూడటం లేదా పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పెలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. మరింతమంది మహిళలను వర్క్ఫోర్స్లోకి తీసుకురావడానికి అందరూ కలిసి పనిచేయాలని ఆమె చివరగా పిలుపునిచ్చారు.









