తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్తగా, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 30వ తేదీ నుంచి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రకటించింది. భక్తులు ఈ ప్రత్యేక దర్శనాన్ని పది రోజుల పాటు పొందవచ్చని టీటీడీ ఈవో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా సామాన్య భక్తులకు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునే వెసులుబాటు కలుగుతుందని టీటీడీ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులలో సామాన్యులకే అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి కేటాయించిన మొత్తం సమయం 182 గంటలు కాగా, ఇందులో ఏకంగా 164 గంటలు పూర్తిగా సాధారణ భక్తులకే కేటాయించబడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కీలక నిర్ణయం ద్వారా ఎక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించబడుతుంది. టీటీడీ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.









