నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అనేక కొత్త నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైన మార్పు ఆధార్ వివరాల సవరణ (Aadhaar Update) ప్రక్రియలో చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఆధార్లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మార్చుకోవడానికి చాలా సందర్భాల్లో ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తీసుకున్న కొత్త నిర్ణయంతో, ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ఈ వివరాలను మార్చుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ ఆన్లైన్ సవరణ కోసం వినియోగదారులు ₹75 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, బయోమెట్రిక్ (ఫోటో, వేలిముద్రలు, నేత్ర స్కాన్) మార్పుల కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికే వెళ్లాల్సి ఉంటుంది, ఇందుకు ₹125 చార్జీ ఉంటుంది.
బ్యాంకింగ్ రంగంలో కూడా నవంబర్ 1 నుంచి ఒక ముఖ్యమైన మార్పు అమల్లోకి వస్తోంది. ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలకు లేదా లాకర్లకు గరిష్ఠంగా ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే నామినీలుగా నియమించుకునే అవకాశం ఉండేది. కానీ, కొత్త నియమం ప్రకారం, ఒక ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఆస్తి వారసత్వ వివాదాలు తగ్గే అవకాశం ఉంది. మరణానంతరం నిధుల పంపిణీ సులభతరం కావడంతో పాటు, ఇది ఖాతాదారులకు మరింత భద్రత కల్పించే విధంగా ఉండనుంది.
ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులకు సంబంధించి మరో ముఖ్యమైన నియమం అమల్లోకి వస్తోంది. థర్డ్ పార్టీ యాప్స్ (ఉదాహరణకు: PhonePe, Paytm, Google Pay) ద్వారా విద్యా ఫీజులు చెల్లించడం (Education Payments) లేదా ₹1,000కు పైగా వాలెట్ రీఛార్జ్ చేయడంపై ఇకపై 1 శాతం ఫీజు వసూలు చేయనున్నారు. అంటే, పెద్ద మొత్తంలో డిజిటల్ చెల్లింపులు చేసేవారు ఈ అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం డిజిటల్ లావాదేవీల ఖర్చులను నియంత్రించి, బ్యాంక్ సర్వీస్ లాభదాయకతను పెంచడం లక్ష్యంగా తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి ఈ మార్పులు సాధారణ ప్రజల ఆర్థిక మరియు డిజిటల్ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.









