UPDATES  

NEWS

 తిరుమలలో తొమ్మిది టన్నుల పుష్పాలతో శ్రీవారికి వైభవంగా వార్షిక పుష్పయాగం

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పుష్పయాగ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. సాధారణంగా వార్షిక బ్రహ్మోత్సవాలలో జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం సందర్భంగా అర్చకులు ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివార్ల ఉత్సవమూర్తులను ఆలయ కళ్యాణమండపంలో ప్రత్యేక వేదికపై ఆసీనులను చేశారు.

ఈ పుష్పయాగానికి సుమారు తొమ్మిది టన్నుల రకరకాల సువాసనలు వెదజల్లే సంప్రదాయ పుష్పాలు మరియు పత్రాలను ఉపయోగించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు మరియు తమిళనాడు నుంచి ఐదు టన్నుల పుష్పాలను సేకరించారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, గులాబీ, కనకాంబరం, మల్లె వంటి 16 రకాల పుష్పాలు, మరియు తులసి, మరువం, దవనం వంటి 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవార్లకు అంగరంగ వైభవంగా పుష్పార్చన జరిగింది.

ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేదమంత్రాల నడుమ ఈ కైంకర్యాన్ని వేదపండితులు నిర్వహించారు. పుష్పయాగంతో తిరుమల పులకించిపోయింది. ఈ మహోత్సవం ఆలయ సంప్రదాయంలో విశేష స్థానాన్ని కలిగి ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |