బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని కీలక హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను కేవలం రూ.500కే అందిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. దీంతో పాటు వృద్ధాప్య పెన్షన్ను నెలకు రూ.1,500కు పెంచుతామని మరో ముఖ్యమైన హామీ ఇచ్చారు.
సిమ్రీ భక్తియార్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను వింటుందని, రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో 55 కుంభకోణాలు జరిగాయని గతంలో మోదీయే చెప్పారని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నేరాల రేటు అధికంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
“నేను అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పను. నేను చేసేదే చెబుతాను” అని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఎన్నికల్లో గెలిస్తే, తాను ప్రజల ముఖ్యమంత్రి అవుతానని, బీహార్లో అవినీతి రహిత, సురక్షితమైన ప్రభుత్వాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే తేజస్వి యాదవ్ ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, జీవికా దీదీలను పర్మినెంట్ చేసి నెలకు రూ.30,000 జీతం వంటి హామీలు ఇచ్చారు. ఇటీవల ఆయనను మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో, కూటమిలో ఐక్యత నెలకొంది.









