తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (శనివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కార్యాలయంలో జరగనున్న కీలక సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ఎంపికపై చర్చ జరగనుంది. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే 22 మంది పరిశీలకులను నియమించిన కాంగ్రెస్ అధిష్ఠానం, ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో సీనియర్ నాయకులను ఇన్ఛార్జిలుగా నియమించింది. డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆయా జిల్లాల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో, ఈ నెలాఖరు వరకు తుది నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆయన కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.









