కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంపీ బైరెడ్డి శబరి ప్రమాద వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఎదురుగా వస్తున్న ఓ బైక్ బస్సులోని ఫ్యూయల్ ట్యాంక్ను బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఎంపీ శబరి తెలిపారు. బైక్ ఢీకొట్టడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయని, బస్సు ‘బాంబులా పేలినట్లు’ ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారని ఆమె వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులలో కొందరు అప్రమత్తమై, కిటికీల అద్దాలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మొత్తం 19 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని ఎంపీ శబరి తెలిపారు. వారికి స్వల్ప గాయాలు లేదా ఫ్రాక్చర్లు అయ్యాయని, అయితే ఎవరి పరిస్థితీ విషమంగా లేదని ఆమె స్పష్టం చేశారు.
దురదృష్టవశాత్తు, మిగిలిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. గంట, గంటన్నర వ్యవధిలో విచారణ పూర్తి చేసి, మృతుల వివరాలను వెల్లడిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గారు వెంటనే స్పందించి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారని బైరెడ్డి శబరి తెలిపారు.









