UPDATES  

NEWS

 ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. డేట్ ఫిక్స్ చేసిన సీఎం..! ఎప్పుడంటే.?

రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త! ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

“మా ప్రభుత్వం మహిళా పక్షపాతి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది వారికి మేము ఇచ్చే కానుక. ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తాం” అని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించడంతో సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

 

ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూనే, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తామని తెలిపారు. ఇప్పటికే 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4.96 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 4.51 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు పింఛన్లు అందిస్తున్నామని, అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు.

 

“దీపం-2” కింద మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని, పాఠశాలలు తెరిచేలోగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని, “తల్లికి వందనం” కింద రూ.15 వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని భరోసా ఇచ్చారు.

 

రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించే లక్ష్యంతో 1998లో తాను ప్రారంభించిన రైతు బజార్ల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. ప్రస్తుతమున్న 125 రైతు బజార్ల సంఖ్యను పెంచుతామని, కర్నూలులోని రైతు బజార్ ఆధునికీకరణకు రూ.6 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.

 

పాణ్యం నియోజకవర్గంలో రూ.50 లక్షలతో ఉద్యానవన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే, నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |