ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ(DSC) నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256 జారీ చేసింది. త్వరలో మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీని ప్రకటించింది.
ఒకటి, రెండు రోజుల్లో 16,347 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. గత ప్రభుత్వంలో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సమయం పట్టింది. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం.. ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ వేసేందుకు సిద్ధమైంది. డీఎస్సీ నిర్వహించేకంటే ముందే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
జులైలో టెట్ కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. టెట్-2024కు సంబంధించి షెడ్యూల్, నోటిఫికేషన్, ఇన్ఫర్మెషన్ బులిటెన్, సిలబస్, ఆన్ లైన్ లో జరిగే పరీక్షలపై జులై 2న ప్రకటన చేసే అవకాశం ఉంది. https://cse.ap.gov.in/ వెబ్ సైట్ వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. కాగా మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల నిర్వహించిన కేబినెట్ మీటింగ్లోనూ మెగా డీఎస్సీ నిర్వహణకు ఆమోదం కూడా తెలిపారు.
ఏపీలో కొద్ది రోజుల క్రితం టెట్ నిర్వహించారు. వాటికి సంబంధించి ఇప్పటి ఫలితాలను విడుదల చేశారు. తాజాగా మరోసారి టెట్ నిర్వహించనున్నారు.









