తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం.. రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి కేసీఆర్ను ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది.
దీనికోసం ఏర్పాటైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణపై స్టే మంజూరు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసుకున్న పిటీషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఫలితంగా- విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ కొనసాగడం ఖాయమైంది. ఈ కమిషన్ ఇక కార్యాచరణలోకి దిగడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది.
కేసీఆర్ హయాంలో ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. అలాగే- యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలోనూ భారీగా అవినీతి, అవకతవకలు చోటు చేసుకున్నాయని చెబుతోంది.
వీటిపై విచారణ చేపట్టడానికి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి సారథ్యంలో ప్రత్యేకంగా ఓ కమిషన్ను సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించడం, విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉంది ఈ ఏకసభ్య కమిషన్కు.
ఈ కమిషన్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు, ప్రక్రియలపై స్టే విధించాలని కోరుతూ ఇటీవలే కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జూన్ 25వ తేదీన రిట్ పిటీషన్ దాఖలు చేశారు. దాన్ని విచారణకు స్వీకరించింది హైకోర్టు. కొద్దిసేపటి కిందటే ఇది బెంచ్ మీదికి విచారణకు వచ్చింది. పరిశీలించిన అనంతరం స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పిటీషన్ను కొట్టేసింది.









