తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రైతు రుణమాఫీ అమలు పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే మంత్రివర్గ భేటీలో రూ 2 లక్షల రుణమాఫీకి ఆమోద ముద్ర వేసారు. అమలుకు సంబంధించిన విధివిధానాలను వెల్లడిస్తామని చెప్పారు. తాజాగా రుణమాఫీ అమలు పైన రేవంత్ కీలక సంకేతాలు ఇచ్చారు. కుటుంబం ప్రాతిపదికగా రూ 2 లక్షల రుణమాఫీ అమలు అవుతుందని వెల్లడించారు. బంగారం రుణాలకు మాఫీ వర్తించదని స్పష్టం చేసారు.
మార్గదర్శకాలు రైతురుణమాఫీ మార్గదర్శకాలు నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. బంగారుం రుణాలు ఈ మాఫీ పరిధిలోకి రావని తేల్చి చెప్పారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ నిర్దారణ చేస్తామని రేవంత్ స్పష్టం చేసారు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా కుటుంబ నిర్దారణ చేస్తామని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
కుటుంబానికి రూ2 లక్షలు ఒక కుటుంబంలో మూడు, నాలుగు రుణాలు కలిపి ఎంత ఉన్నా..కుటుంబానికి గరిష్ఠంగా రూ 2 లక్షల వరకు అమలు అవుతుందని చెప్పారు. రూ 2 లక్షల మేర తీసుకున్న రుణాలు దాదాపుగా రూ 6 -7 వేల కోట్లు ఉంటుందని అంచనా వేసారు. అత్యధికంగా రూ 50 వేల నుంచి రూ లక్ష వరకు రుణం తీసుకున్న సన్నకారు, చిన్నకారు రైతులే ఎక్కువగా ఉంటారని రేవంత్ వివరించారు. రుణమాఫీ పూర్తయిన తరువాత రూ 4వేలకు పెన్షన్ పెంపు పైన ఫోకస్ చేస్తామని రేవంత్ వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణ..పీసీసీ చీఫ్ నియామకం ఒకే సారి ఉంటాయని చెప్పారు.
మంత్రివర్గ విస్తరణలో వారికే పీసీసీ పదవి విషయంలో సామాజిక న్యాయం అమలు చేస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 శాతం పదవులు ఉండాలనేది పార్టీ విధానంగా రేవంత్ చెప్పుకొచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవి మహిళలకు ఇవ్వాలా .. ఇప్పటికే కార్యవర్గంలో ఉన్న వారికి ఇవ్వాలా అనేది ఆలోచన చేస్తామన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఆగస్టుతో పూర్తవుతుంది..కొత్త నియామకాలు చేసిన తరువాత కుల గణన చేపడతామని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఫాం పైన గెలిచిన వారికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.









