ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ పార్టీ అధినాయకత్వంతో పాటుగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీ కి కొత్త చీఫ్ నియమాకం పైన కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో జీవన్ రెడ్డి వ్యవహారం చర్చగా మారింది. ఈ మొత్తం పరిణామాలపైన రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కొత్త పీసీపీ చీఫ్ నియామకం చేపట్టాలని తానే హైకమాండ్ ను కోరినట్లు వెల్లడించారు.
రేవంత్ క్లారిటీ ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్ర సమస్యల పైన చర్చలు చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందంటూ వస్తున్న వార్తల పైన రేవంత్ స్పందించారు. మంత్రివర్గ విస్తరణ పైన ఎలాంటి చర్చ జరగలేదేన్నారు. ప్రస్తుతం శాఖలు ఖాళీగా లేవన్నారు. హోం, విద్యా శాఖ తన వద్దే ఉందని…నిరంతర సమీక్షలతో గతం కంటే మెరుగ్గా పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. జూలై 7న పీసీసీ చీఫ్ గా తాను బాధ్యతలు చేపట్టి మూడేళ్ల కాలం పూర్తవుతుందన్నారు. తన స్థానంలో కొత్త వారిని నియమించాలని కోరినట్లు రేవంత్ వెల్లడించారు.
నూతన టీపీసీసీ చీఫ్ తాను పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే అసెంబ్లీ..పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని..సమర్ధవంతంగా పని చేసామని చెప్పారు. సమర్ధత – సామాజిక సమీకరణాల ఆధారంగా నూతన పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాలని కోరినట్లు రేవంత్ వివరించారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తన పార్టీలో కేసీఆర్ చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారని గుర్తు చేసారు. బీజేపీ తో కలిసి తన ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు చేయలేదా అని ప్రశ్నించారు.
జీవన్ రెడ్డికి ప్రాధాన్యత జీవన్ రెడ్డి వ్యవహారంలో కొందరు ఇతర పార్టీల నేతలు గోతి కాడ కాచుకుకొని కూర్చుకున్నారని..జీవన్ రెడ్డికి పార్టీపైన ఉన్న కమిట్మెంట్ వారికి తెలియదన్నారు. జీవన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ భరోసా ఇచ్చిందని..సరైన సమయంలో సరైన విధంగా ఆయన సేవలు వినియోగించుకుంటామని రేవంత్ స్పష్టం చేసారు. కేసీఆర్ ఇప్పుడు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకొనే పనిలో ఉన్నారన్నారు. బీజేపీతో ఒప్పందం లేకపోతే సిరిసిల్లలో ఆ రెండు పార్టీలకు సమాన ఓట్లు..మెదక్ లో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. ఏపీతో సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు.









