ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ మరో ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన రెండు సీట్లకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడంతో వారిపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఏపీ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా రెండు సీట్లకు ఉపఎన్నిక నిర్వహించేందుకు వీలుగా ఇవాళ నోటిఫికేషన్ వెలువడింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లే. జూలై రెండవ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. జూలై 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే జూలై 5న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం జూలై 12న ఈ ఉపఎన్నిక ఉంటుంది.
ఈసారి ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎన్నిక కావడంతో అసెంబ్లీలో పార్టీల బలబాలాల ఆధారంగా చూస్తే కూటమికే ఈ రెండు సీట్లు దక్కే అవకాశముంది. ఒకవేళ విపక్షంలో ఉన్న వైసీపీ బరిలోకి దిగితే మాత్రం జూలై 12న ఎన్నిక నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. వైసీపీ పోటీ చేయకపోతే మాత్రం ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ముందే ప్రకటిస్తారు.









