తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ‘మహిళా శక్తి మిషన్’ను బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా డ్వాక్రా (స్వయం సహాయక సంఘాల) మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రూ. 2,500 కోట్ల వడ్డీ లేని రుణాలను కేటాయించారు. ఈ నిధులు మహిళలు తమ స్వయం ఉపాధి మార్గాలను మెరుగుపరుచుకోవడానికి మరియు వ్యాపార వృద్ధికి వెన్నుదన్నుగా నిలవనున్నాయి.
రాష్ట్రంలోని 67 లక్షల మంది మహిళలతో కూడిన ఐకేపీ (IKP) నెట్వర్క్ను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం విభిన్న రకాల రుణ సదుపాయాలను కల్పిస్తోంది. గ్రామీణ మహిళల కోసం రూ. 5 వేల నుంచి 5 లక్షల వరకు రుణాలు, పిల్లల విద్య మరియు ఆరోగ్య అవసరాల కోసం ‘స్త్రీ నిధి’ ద్వారా ప్రత్యేక రుణాలు అందుబాటులో ఉంచారు. మహిళా సంఘాల్లో చేరే వయోపరిమితిని కూడా 18 ఏళ్ల నుంచి 61 ఏళ్ల వరకు సవరించడం ద్వారా మరింత మందికి ప్రభుత్వ ఫలాలను అందేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో బ్యాంకుల ద్వారా మొత్తం లక్ష కోట్ల రుణాలను మహిళా సంఘాలకు ఇప్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా, మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)కి అద్దెకు ఇవ్వడం, పెట్రోల్ బంకుల నిర్వహణను మహిళలకు అప్పగించడం వంటి నిర్ణయాలు ఇందులో భాగం. ఇప్పటికే 494 బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాగా, మరిన్ని పెట్రోల్ బంకులను మహిళా సంఘాలకు కేటాయించనున్నారు. అలాగే, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రీ-ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు మరియు 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం చేపట్టాలని బడ్జెట్లో నిర్ణయించారు.








