ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ ఇప్పటికే తిరుమల చేరుకోగా, లోకేశ్ కాస్త ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. తిరుమలలోని గాయత్రీ అతిథి గృహంలో ఈ రాత్రి నారా కుటుంబం బస చేయనుంది.
రేపు (మార్చి 21) నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పర్యటన ఖరారైంది. ఏటా దేవాన్ష్ పుట్టినరోజును తిరుమలలో జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం నారా కుటుంబం మొత్తం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత పర్యటన అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
దేవాన్ష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నారా కుటుంబం శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం ప్రకటించింది. ఒక రోజు అన్నవితరణకు అయ్యే పూర్తి ఖర్చు రూ.44 లక్షలను వారు విరాళంగా అందజేయనున్నారు. రేపు ఉదయం దర్శనం అనంతరం అన్నప్రసాదం కార్యక్రమంలో కూడా వారు పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం తిరుమలలో సీఎం పర్యటన దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.









