ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. గత రంజాన్ పండుగ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ పర్యటనలో భాగంగా షేక్ షెహన్సా అనే నిరుపేద ముస్లిం కుటుంబాన్ని ఆయన సందర్శించారు. ఆ సమయంలో వారు నివసిస్తున్న పాత రేకుల ఇంటిని గమనించిన లోకేష్, వారికి పక్కా ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం ఏడాది తిరగక ముందే సొంత ఖర్చుతో ఆధునిక వసతులతో కూడిన కొత్త ఇంటిని నిర్మించి ఆ కుటుంబానికి అప్పగించారు.
ఈ నూతన గృహ ప్రవేశం సందర్భంగా షెహన్సా కుటుంబ సభ్యులు లోకేష్కు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ పూర్వీకుల కాలం నాటి శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఇబ్బందులు పడుతున్న తమను గుర్తించి, ఆపన్నహస్తం అందించినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, పేదలకు అండగా నిలబడటం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
మంత్రిగా రాష్ట్రవ్యాప్త బాధ్యతలు నిర్వహిస్తూనే, తన నియోజకవర్గ ప్రజల కష్టాలను స్వయంగా పర్యవేక్షించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా వచ్చే వినతులపైనే కాకుండా, క్షేత్రస్థాయిలో తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ కొత్త ఇల్లు లభించడం తమ జీవితాల్లో నిజమైన వెలుగులు నింపిందని ఆ ముస్లిం కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.








