ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. మూడు పార్టీల కూటమి అధికారం చేపట్టిన వెంటనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఆర్డీఏ పరిధిలో వైసీపీ కార్యాలయాన్న అధికారులు కూల్చేసారు. నిబంధనలను అతిక్రమించి కట్టటంతోనే కూల్చివేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ తప్పు బట్టింది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ లక్ష్యంగా మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నామ మాత్రపు చెల్లింపులతో ప్రతీ జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రారంభించిందంటూ కథనాలు వస్తున్నాయి. తాజాగా సీఆర్డీఏ పరిధిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత పైన రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. కార్యాలయం కూల్చివేత పైన మాజీ సీఎం జగన్ ట్వీట్ చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసారు. దీని పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, మంత్రి లోకేష్ ఈ మొత్తం వ్యవహారం పై స్పందించారు. లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు.
“జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా!” అని జగన్ను ప్రశ్నించారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావని, జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావని మండిపడ్డారు.” నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ.600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి?. నీ ధనదాహానికి అంతులేదా?” అని ప్రశ్నించారు.
ఈ మేరకు మీడియాలో వెలువడిన పలు క్లిప్పింగులను ఆయన షేర్ చేశారు. విశాఖతో పాటుగా పలు జిల్లాల్లో వైసీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాలు నిర్మించిందనే ఆరోపణలు ఉన్న ప్రాంతాల్లో అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.









