ఏపీలో కొత్త ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో తీసుకున్న పలు నిర్ణయాల్లో మార్పులు చేస్తోంది. అధికార యంత్రాంగంలో ప్రక్షాళన ప్రారంభించింది. ఎన్నికల సమయంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ పైన చంద్రబాబు నాడు హామీ ఇచ్చారు. కొందరు వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసారు. ఇక, ఇప్పుడు వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
వాలంటీర్ల కొనసాగింపు ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ – వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వాలంటీర్లు వైసీసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ సరి కాదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందటంతో వారిని ఆ పంపిణీ నుంచి దూరం పెట్టారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసారు. పెన్షన్ల పంపిణీ సమస్యగా మారిన సమయంలో వాలంటీర్లను కొనసాగిస్తామని…వారికి రూ 10 వేలు వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ిచ్చారు.
పెన్షన్ల పంపిణీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చెప్పిన విధంగా పెన్షన్ రూ 4 వేలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసారు. ఈ సమయంలో వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా కొత్త వారి విషయంలో ఎలాంటి నిర్నయం తీసుకుంటారనేది చర్చగా మారింది. ఈ సమయంలోనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయాలు, వలంటీర్ల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లను కొనసాగిస్తామని వెల్లడించారు. వైసిపి నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, మా జీవితాలతో ఆడుకున్నారని వలంటీర్లు తన ఫోన్కు వాట్సప్ మెసేజ్లు పంపించారని చెప్పారు.
మంత్రివర్గంలో నిర్ణయం ఇలాంటి మెసేజ్లతో తన వాట్సప్ అంతా నిండిపోయిందని చెప్పారు. వలంటీర్లతో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. వచ్చే ఒకటో తేదీన పింఛనుదారులకు రూ.7 వేలను వారి ఇంటి వద్దే అందిస్తామన్నారు. కొందరు గతంలో రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ నేతలను కలుస్తున్నారు. వీరి కొనసాగింపు పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వటంతో..వేతనాలు, కొత్త నియామకాల పైన త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.