ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. జూన్ 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. వాస్తవానికి జూన్ 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది.
కాగా, జూన్ 24న ప్రొటెం స్పీకర్ను ఎన్నుకున్న తర్వాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా, ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యన్నపాత్రుడు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. వీటిపై కూటమి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 164 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ఇందులో అత్యధికంగా టీడీపీకి 135 స్థానాలు, జనసేనకు 21, బీజేపీకి 9 సీట్లు దక్కాయి. ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాల్లోనే గెలుపొందింది.
ఈ నేపథ్యంలో జూన్ 12న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తక్షణమే చంద్రబాబు నాయుడు ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే.