తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని రవాణాశాక మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
సిద్ధమవుతున్న నివేదిక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడపలోని దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. దీనిపై ప్రస్తుతం రవాణాశాఖ కసరత్తు చేస్తోందని, త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో రోజూ ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు? వారికి ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించడంవల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? అనే విషయాలపై అధికారులు నివేదిక కూడా సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు.
ఆటోడ్రైవర్ల నుంచి వ్యతిరేకత రాకుండా.. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించగానే ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిద్వారా తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చేపట్టారు. అయితే వారినుంచి వ్యతిరేకత రాకుండా ఉండేలా ఈ పథకాన్ని అమలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాంప్రసాద్ రెడ్డి రాయచోటి వెళ్లారు. మూడు జిల్లాల పరిధిలో ఏకైక మంత్రి కావడంతో ఆయన అనుచరులు, అభిమానులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. రవాణాశాఖ మంత్రిగా ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో ఎక్కడా చంద్రబాబుకు చెడ్డపేరు రాకుండా ఈ ఐదు సంవత్సరాలు పనిచేస్తానని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.