సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేటీఆర్ తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల ఆర్వోలకు నోటీసులు జారీ చేసింది.
కేటీఆర్ నామినేషన్ సందర్భంగా వాస్తవాలు వెల్లడించలేదని, అందువల్ల ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డితోపాటు లగిశెట్టి శ్రీనివాసులు వేర్వేరుగా ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన నామినేషన్ డాక్యుమెంట్స్ లో ఆయన కొడుకు కే హిమాన్షు పేరిట ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో తనపై భార్య, మైనర్ కుమార్తెలే ఆధారపడ్డారని చెప్పారు. అయితే, గత ఏడాది జులైలో మేజర్ అయిన హిమాన్షు తనపై ఆధారపడలేదని కూడా తెలిపారని పేర్కొన్నారు.
హిమాన్షు సిద్దిపేట మర్కూక్ మండలం వెంకటాపూర్ లో నాలుగు ఎకరాలు, ఎర్రబల్లిలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసేందుకు వరుసగా రూ. 10.50 లక్షలు, రూ. 88.15 లక్షలు చెల్లించారని, కేటీఆర్ ఆర్థిక మద్దతు లేకుండా ఇటీవలే మేజర్ అయిన హిమాన్షుకు అంత డబ్బు ఎలా వస్తుందని ప్రశ్నించారు. తండ్రి ఆర్థిక సాయం లేకుండా అంత మొత్తాన్ని హిమాన్షు ఎలా చెల్లించగలరని ప్రశ్నించారు.
ఎన్నికల అఫిడవిట్లో నిజాలు చెప్పకుండా చేయడం ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 123కు విరుద్ధమని, రుక్మిణి మాదగౌడ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని వివరించారు. వాదనల అనంతరం ఈ విషయంపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేశారు.