ఏపీలో గతంలో నిరుపేదలకు నామమాత్రపు ధరకు పట్టెడన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం మూసేసింది. దీంతో ఈ ఐదేళ్లలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు స్వయంగా డబ్బులు ఖర్చుపెట్టి వాటిని తిరిగి ప్రారంభించడమే కాకుండా నిరంతరాయంగా నడిపిస్తున్నారు. దీంతో తాము తిరిగి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామనని హామీ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఏర్పాటు కాగానే చంద్రబాబు నాలుగో ఫైలుగా సంతకం కూడా చేసేశారు. దీంతో ఇప్పుడు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం 203 క్యాంటీన్లు ప్రారంభించాలని భావించారు. కానీ 184 క్యాంటీన్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. దీంతో వీటిలోనే నామమాత్రపు ధరకు ఆహారం పేదలకు అందించారు. ఆ లోపు ప్రభుత్వం మారడంతో మిగతా క్యాంటీన్ల నిర్మాణం మూలనపడింది. అంతే కాదు నిర్మించిన క్యాంటీన్లను సైతం వైసీపీ ప్రభుత్వం చాలా చోట్ల ఇతర అవసరాలకు వాడేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల వాస్తవ పరిస్ధితి తెలుసుకునేందుకు ఇవాళ్టి నుంచి అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించబోతున్నారు.
100 రోజుల్లో అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా పునరుద్ధరించేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 21 నాటికి రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని అధికారులకు ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టేసింది. దీంతో వారు ఉరుకులు పరుగులు తీస్తున్నారు.
గతంలో అన్న క్యాంటీన్ల కోసం టీడీపీ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ను కూడా వైసీపీ ప్రభుత్వం వాడకుండా అలాగే వదిలేసింది. ఇప్పుడు ఆ నిధులతో పాటు కొత్తగా ఎన్ని నిధులు అవసరమవుతాయో త్వరలో క్లారిటీ రానుంది. అనంతరం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం మిగతా నిధులు విడుదల చేయబోతోంది. దీంతో పాటు అన్న క్యాంటీన్లలో ఆహార సరఫరాకు టెండర్లను పిలువబోతోంది.