ఏపీలో వైసీపీని ఓడించాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మరోసారి పిలుపునిచ్చారు. హత్యలు చేసేవారికి ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. వైెఎస్ వివేకా హత్యపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ ప్రొద్దుటూరులో వైఎస్ వివేకా హత్య విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీఎం పక్కనే ఉన్నారు.
బాబాయ్ అంటే అర్థం తెలుసా? అని వైఎస్ జగన్ ను సునీత ప్రశ్నించారు. నాన్న తర్వాత నాన్న లాంటి వ్యక్తిని హత్య చేస్తే ఈ కేసులో పురోగతిలేదన్నారు. బాధిత కుటుంబపైనే నింద మోపడం న్యాయమా అంటూ నిలదీశారు. సోదరి న్యాయస్థానాలు, పోలీసుల చుట్టూ న్యాయం కోసం తిరుగుతుంటే అన్నగా బాధ్యత లేదా ? అంటూ ప్రశ్నించారు. తన తండ్రిని చంపిందెవరో దేవుడి, ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబంపైనా సునీత విమర్శలు గుప్పించారు. వివేకాను వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి హత్య చేయించారని నిందితుడు చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. గత ఐదేళ్లుగా ఏపీలో జగన్ ప్రభుత్వమే ఉందన్నారు. నిందితులను జగన్ రక్షిస్తున్నారని ఆరోపించారు. గతంలో సీబీఐ విచారణ చేయాలని జగన్ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారని తెలిపారు.
ఐదేళ్ల తర్వాత బాబాయ్ గుర్తుకు వచ్చారా? అని జగన్ ను సునీత ప్రశ్నించారు. హత్య కేసును రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. హంతకులకు ఓటు వేయాలని జగన్ పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్యకేసులో అసలైన సూత్రధారులకు శిక్ష పడాలని స్పష్టం చేశారు.
తన తండ్రి హత్యపై న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని సునీత అన్నారు. హంతకులకు ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. పదవుల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ పునాదులు వివేకా రక్తంలో మునిగి ఉన్నాయన్నారు.