జగన్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడమే కూటమి లక్ష్యమన్నారు. మూడు పార్టీల జెండాలు వేరైనా, అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. మంగళవారం విజయవాడలో పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, తమ కూటమిని త్రివేణి సంగమంగా వర్ణించారు.
కూటమిలోని ప్రతి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కేడర్కు పిలుపునిచ్చారు పురందేశ్వరి. సీఎం జగన్ను గద్దెదించడానికి మూడుపార్టీలు కలవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఏపీలో రామరాజ్యం సాకారమవుతుందని మనసులోని మాటను బయటపెట్టారు. ఈ క్రమంలో టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందన్నారు.
పనిలోపనిగా జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు పురందేశ్వరి. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తన ఆధీనంలో పెట్టుకుందని, ఈ క్రమంలో దొంగ ఓటర్లను చేర్పించిందని దుయ్యబట్టారు. గడిచిన ఐదేళ్లలో ఏపీ అప్పులు తప్ప ఏమీ మిగల్లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పుడు చేసిందని ఆరోపించారు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా అని ఆ పార్టీకి చెందిన ఓ నేత ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం జగన్ మాటల్లో తప్ప చేతల్లో ఏమీ చేయలేదన్నారు.









