ఎన్నికలు సమీపిస్తున్న వేల రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారుల ముకేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారం చేయడానికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.
రాష్ట్రంలో రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలతో పాటు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అనుమతుల కోసం వారు సువిధ పోర్టల్ ను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు. suvidha.eci.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో ముకేశ్ కుమార్ మీనా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఇంటింటి ప్రచారానికి, సభలు, ర్యాలీలకు అనుమతులు తీసుకోవాల్సిందేనని వారికి స్పష్టం చేశారు. ఇవి నిర్వహించే 48 గంటల ముందుగానే అనుమతుల కోసం సువిధ యాప్, పోర్టల్ నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే వారికి అనుమతులు మంజూరు అవుతాయన్నారు.
సువిధా యాప్ ను ప్రభుత్వం.. ఆన్ లైన్ నామినేషన్లు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల కోసమే తీసుకువచ్చిందని ఆయన రాజకీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతో పాటుగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించవల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. అలాగే ఎటువంటి అవాంచనీయ ఘటనకు తావు లేకుండా చూడలని హెచ్చరించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు.