UPDATES  

NEWS

 తెలంగాణ గవర్నర్ తమిళి సై రాజీనామా…!

తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళి సై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఈ విషయాన్ని రాజ్ భవన్ ధృవీకరించింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున చెన్నై సెంట్రల్ నియోజకవర్గం లేదా చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి నుంచి ఆమె ఎంపీగా పోటీచేయనున్నట్లు తెలుస్తోంది.

 

ఈ మేరకే ఆమె రాజీనామా చేసినట్లు సమాచారం. కన్యాకుమారి తమిళిసై సొంత జిల్లా. కన్యాకుమారి, తిరునల్వేలిలో నాడార్ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో.. ఈ రెండింటిలో ఏదొక స్థానం నుంచే పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. ఢిల్లీ పెద్దలతో దీనిపై చర్చించాకే ఆమె రాజీనామా పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

2019 సెప్టెంబర్ నుంచి తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 2021 ఫిబ్రవరి 21న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారామె. కాగా.. తమిళిసై తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. ఆమె మాత్రం బీజేపీలో చేరారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం కోసం ఆమె కృషి చేశారు.

 

20 ఏళ్లకు పై నుంచే రాజకీయాల్లో ఉన్న తమిళిసై సౌందర రాజన్.. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2011లో వెలచ్చేరి, 2016లో విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.

 

తమిళిసై సౌందర రాజన్ ఉన్నత చదువులు అభ్యసించారు. మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ చదివిన ఆమె.. ఎంజీఆర్ మెడికల్ వర్శిటీలో డీజీఓ, కెనడాలో సోనాలజీ, ఎఫ్ఈటీ థెరపీలో ఉన్నత విద్యను అభ్యసించారు.

 

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో.. ఆమెకు పలుమార్లు విభేదాలు తలెత్తాయి. గవర్నర్‌ను ప్రభుత్వం గౌరవించడం లేదని పలుమార్లు ఆరోపించారు. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని వెనక్కి తిప్పి పంపడం, పెండింగ్‌లో ఉంచడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.

 

తమిళనాడుకు చెందిన తమిళ సై వృత్తిరీత్యా వైద్యురాలిగా పనిచేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. తమిళిసై కు చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఎంబీబీఎస్ విద్యను చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేశారు. బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితురాలై ఆ పార్టీలో చేరారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2007లో అఖిల భారత కో-కన్వీనర్‌గా 2007లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2010లో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలిగా, 2013 లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014లో తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు.

 

2006, 2011లో రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009, 2019లో రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో ఆమె చెన్నై సెంట్రల్, తుత్తుకూడి నియోజకవర్గాల నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలున్నాయి

అంటున్నారు.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |