ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న హోం సెక్రటరీలను తొలగించాలని ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది.
మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లలో సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శులను కూడా తొలగించారు. ఎన్నికలకు సంబంధించిన పనులతో సంబంధం ఉండి మూడేళ్లు పూర్తి చేసుకున్న లేదా వారి సొంత జిల్లాల్లో ఉన్న అధికారులను బదిలీ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను పోల్ ప్యానెల్ ఆదేశించింది.
అటు పశ్చిమ బెంగాల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)ను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అదనంగా, బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్, అదనపు/డిప్యూటీ కమిషనర్ల బదిలీకి ఆదేశించింది. ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు రిపోర్టు చేయాలని కమిషన్ పేర్కొంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రెండు రోజుల్లో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 1951-52 ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘంగా జరగనున్న ఎన్నికలు ఇవే కావడం విశేషం.
ఏప్రిల్ 19న మొదటి దశలో 102 పార్లమెంటరీ నియోజకవర్గాలు, ఏప్రిల్ 26న ఫేజ్ 2లో 89, మే 7న ఫేజ్ 3లో 94, మే 13న ఫేజ్ 4లో 96, మే 13న ఫేజ్ 5లో 49, మే 25న 6వ దశలో 57, జూన్ 1న 7వ దశలో 57 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.









